గ్రామీణ భారతం కరోనా కబంధ హస్తాల్లోకి జారుతున్నది. ఇంతకాలం జనసాంద్రత అధికంగా ఉన్న నగరాలు, పట్టణాల్లోనే ప్రతాపం చూపించిన కొవిడ్-19 ఇప్పుడు గ్రామసీమలను కమ్ముకుంటున్నది. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి సొంతూర్లకు చేరుతున్న వలస కూలీలు కరోనాను కూడావెంటతీసుకెళ్తున్నారు. దాంతో స్వచ్ఛమూ సురక్షితమూ అని భావించిన పల్లెల్లో ఇప్పుడు స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది. గంజో తాగి కాలమీడుద్ధామనుకున్న పల్లె జనాలు కరోనాతో కకావికలమవుతున్నారు. దేశంలో కరోనా కేసులు వేలు దాటి లక్షల్లోకి చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తున్నది. పల్లెలు కరోనా గుప్పిట్లోకి వెళ్తున్నాయి. వైరస్పై అవగాహన లేకపోవడం, కరోనా లక్షణాలున్నా సరైన వైద్యం తీసుకోకపోవడంతో గ్రామీణులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రతో సరిహద్దున ఉన్న గ్రామాలు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు చుట్టూఉన్న పల్లెల్లో వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటోంది.