మా ఎన్నికలు ఉత్కంఠ భరిత వాతావరణంలో సాగుతున్నాయి. పరస్పర దూషణలతో పోరును రక్తి కట్టించేందుకు అంతా తమ తమ ప్రయత్నాలు కడదాకా చేస్తూనే ఉన్నారు. యుద్ధంలో ఏ ప్రయత్నమూ లేకుండా ఓడిపోవడం కన్నా ప్రయత్నించడం గొప్ప విషయం అని భావిస్తూ తాము ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని సభ్యులు చెబుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు చేరుకున్నారు. ఇప్పటిదాకా 215 ఓట్లు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయానికి యాభై శాతం ఓటింగ్ జరగవచ్చని ఇరు ప్యానెళ్ల సభ్యులూ అంటున్నారు. అదేవిధంగా కొందరు సభ్యుల దూకుడు స్వభావం కారణంగా పోలింగ్ అధికారులు నానా అవస్థలూ పడుతున్నారు. ఓ సందర్భంలో వారు విసిగిపోయి ఓటింగ్ ను నిలిపివేయడానికి సైతం వెనుకంజ వేయలేదు. దీంతో ఇరు ప్యానెళ్ల సభ్యులతోనూ చర్చించారు కూడా! ఇప్పటికి కాస్త వాతావరణం సర్దుమణిగింది అని మాత్రం తెలుస్తోంది. భోజన విరామం తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.