కరోనా: అదుపులోకి వస్తున్నట్లేనా..?
ప్రజలందరికీ ఒక శుభవార్త. కరోనా అదుపులోకి వస్తున్నట్లే కనపడుతోంది. రెండో దశ ఉధృతి నుంచి దేశం కోలుకొని వడివడిగా అడుగులు వేస్తోంది. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అయినా ముఖానికి మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం మానలేదు. అంటే ఇవి నిత్యజీవితంలో ఒక భాగమయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,058 కేసులు నమోదయ్యాయి. గత 231 రోజుల్లో అతి తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 164 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 1,83,118 ఉండగా, ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,52,454గా తేలింది. దేశవ్యాప్తంగా 98.67 కోట్ల కోవిడ్ టీకా డోసులను ఇవ్వడం జరిగింది. అయితే కొవిడ్ టీకాలివ్వడానికి సిరంజిల కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ చెప్పారు. ఇదంతా అసత్య ప్రచారమని, సిరంజిలకు కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్న పిల్లలకు టీకా విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పరిశోధన పత్రాలను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇది కూడా అతి త్వరలోనే జరుగుతుందన్నారు.