అయిననూ.. పోయిరావలె హస్తినకు?
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలపై దాడులు, విధ్వంసంపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళుతున్నారు. మధ్యాహ్నం రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరిస్తారు. మరికొందరు నేతలను కూడా ఆయన కలిసే అవకాశం కనపడుతోంది. అయితే ఎవరెవరిని కలుస్తారనేదానిపై ఇంతవరకు స్పష్టత లేదు. ప్రభుత్వ ప్రేరేపతి ఉగ్రవాదంగా ఈ దాడులను చంద్రబాబు అభివర్ణిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షాతో అపాయింట్మెంట్ ఖరారైందా? లేదా? అనే విషయంలో ఇంతవరకు స్పష్టత రాలేదు. చంద్రబాబుతోపాటు పార్టీ నేతలు మరికొందరు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోకానీ, పార్టీ నేతలతోకానీ, ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇతర మంత్రులతోకానీ చంద్రబాబుకుకానీ, పార్టీ నేతలకుకానీ సఖ్యత లేదనే విషయం రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం తెలుసు. అయినా తనవంతు ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. ఇక్కడి పరిస్థితిని వివరిస్తారు. ఉపయోగం లేనప్పటికీ అయిననూ పోయిరావలె హస్తినకు అన్న ఉద్దేశంతో వెళ్లడమేకానీ ప్రయోజనం శూన్యమని తెలుగుదేశం పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.