రెండున్నర సంవత్సరాల తర్వాత తొలిసారిగా..?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రెండున్నర సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇంతవరకు ఆయన ఢిల్లీ వెళ్లలేదు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు ఏపీలో పలు జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ ఆయన 36 గంటల దీక్ష చేశారు. ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతిని కలవనున్నారు. రెండున్నర సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అడుగుపెడుతున్న చంద్రబాబు ఇంకా ఎవరెవరిని కలుస్తారనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. రెండురోజులపాటు సాగే ఈ పర్యటనలో ఏపీలో ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసుల వ్యవహరిస్తున్న తీరుతోపాటు గంజాయి, మాదక ద్రవ్యాల విచ్చలవిడి వినియోగం గురించి అందరికీ తెలియజేయనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన విజయవంతమవుతుందా? లేదంటే సాధారణ పర్యటనలానే మిగిలిపోతుందా? అనేది కొద్దిరోజుల తర్వాతే తెలియవస్తుంది. అప్పటివరకు చంద్రబాబునాయుడు కేంద్ర పెద్దలను కలుస్తుండటమొక్కటే పరిష్కారమని తెదేపా వర్గాలంటున్నాయి.