రేవంత్ చెప్పినట్లు ఉమ్మడి రాష్ట్రమవుతుందా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళితే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావొచ్చని కేసీఆర్ కలలు కంటున్నారని ఆరోపించారు. ఇందుకు తగ్గట్లుగా జలవివాదాలను బూచిగా చూపిస్తారన్నారు. ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని కలిసిపోదామంటూ వ్యాఖ్యానించారని, తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేస్తున్నారని, వాటిని కేసీఆర్ ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు. ఇవన్నీ ముందుగా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని రేవంత్రెడ్డి అంటున్నారు. ఒకసారి విడిపోయిన తర్వాత మళ్లీ కలిసిపోవడమంటే దాదాపుగా అసాధ్యమని చెప్పవచ్చు. ఎప్పుడో నిర్మించన బెర్లిన్ గోడను కూలగొట్టి జర్మనీ కలిసిపోయినట్లుగా ఏపీ, తెలంగాణ కలిసిపోవాలంటే ఇక్కడి రాజకీయ నేతలుకానీ, రాజకీయ పరిస్థితులుకానీ ఎట్టి పరిస్థితుల్లోను సహకరించవు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆరోపణలు చేయడానికి మాత్రమే ఈ వ్యాఖ్యలను రేవంత్రెడ్డి ఉపయోగించివుంటారని, అంతకుమించి ఏమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.