సీఎం కాన్వాయ్ కోసం కారు కావాలని తమ కారును అధికారులు లాక్కెళ్లిపోయారని ఓ కుటుంబం ఆరోపిస్తుందని వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. తిరుమల వెళ్తున్నవారిని ఆపి పోలీసు జులుం ప్రదర్శించారని ఆ కుటుంబం వాపోయినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయి. వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబం వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల వెళ్తూ రాత్రి భోజనం కోసం ఒంగోలులో ఆగారట. ఈ కుటుంబంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలు ఉన్నారట.
అయితే.. వారు ఒంగోలు పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ చేస్తుంటే... కానిస్టేబుల్ వచ్చి 22న ముఖ్యమంత్రి ఒంగోలు పర్యటనకు వస్తున్నారని మీ కారు ఇవ్వాలని అడిగారట. తాము తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదని ఆ కుటుంబం చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై సీఎంఓ సీరియస్గా స్పందించినట్టు తెలుస్తోంది.