చిన్న కార్ల కొనుగోలుపై జనాల ఆసక్తి..ఎందుకో తెలుసా
కరోనా దెబ్బకు ప్రపంచమంతా షట్డౌన్గా మారింది. ఆర్థిక రంగం కుదులైంది. అన్ని రంగాలకు కరోనా ప్రభావానికి లోనయ్యాయి. ముఖ్యంగా ఆటో రంగం అతలాకుతలం అవుతోంది. ప్రజా రవాణా కూడా మునుపెన్నడూ లేనంత సంక్షోంభంలోకి కూరుకుపోయింది. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికి ఆటో రంగం కుదుట పడే పరిస్థితులు కనిపిచడం లేదు. అయితే గత కొద్ది రోజులుగా చాలా మంది చిన్న వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు పలు సర్వేలు, ఆటో రంగానికి చెందిన కంపెనీలు వెల్లడిస్తున్నాయి. తక్కువ ధరకు చెందిన కార్ల కొనుగోలుకు సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారట.
సామూహిక ప్రయాణాలతో కరోనా ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న వినియోగదారులు చిన్నతరహా వాహనాల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ఆయా కంపెనీలు వెల్లడిస్తున్నాయి. గడిచిన కొద్దిరోజుల్లో నేరుగా కంపెనీల ఎంక్వయిరీలకు ఫోనకాల్స్ పెరిగినట్లు చెబుతున్నాయి. ప్రజా రవాణా కంటే సొంతగా ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలకు గిరాకీ పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కార్లు, ద్విచక్ర వాహన షోరూమ్లు సందర్శించే వారి సంఖ్య పెరిగిందంట. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా డీలర్లను సంప్రదించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక విడుదలైంది.
ఆయా కంపెనీలకు సంబంధించిన కార్లు, ఏయే మోడళ్లు అందుబాటులో ఉన్నది, రాయితీ ఇస్తున్నారా..., రుణం వెంటనే వస్తోందా..? అన్న అంశాలను ఆరా తీస్తుండటం గమనార్హం. అయితే గతంలో మాదిరిగా టెస్ట్ డ్రైవ్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గముఖం పట్టినట్లు సమాచారం. ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ ‘ఇ-షాప్’ ను ఆవిష్కరించాయి. వాహన వివరాలను చూడటమే కాదు, దాన్ని అక్కడికక్కడే కొనుగోలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వాహనాల రుణం కోసం ఆన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కరోనా వైరస్ ఉధృతి తర్వాత సామూహిక ప్రయాణాలకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక చిన్న కారు అయినా ఉండాలని భావిస్తున్నారట.