హెరాల్డ్ బర్త్డే : డైలాగ్ కింగ్ సాయికుమార్.. బహుముఖ ప్రజ్ఞ
బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన డైలాగ్ కింగ్ సాయికుమార్ చిత్రసీమలో అంచలంచెలుగా ఎదిగాడు. మొదట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ను మొదలు పెట్టిన ఆయన క్రమంగా సినిమాల్లో సహ నటుడి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటుడిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యతగా ఇలా సినీ ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞతో నాలుగు దశాబ్దాలుగా ముందుకు సాగుతున్నారు. పోలీస్ ఆఫీసర్గా, విలన్గా, హీరోగా, తండ్రిగా ఇలా ఆయన ఏ పాత్ర చేసిన దానికి ప్రత్యేకతను చూకూరుస్తుంటారు. సాయికుమార్ కొడుకు ఆది, సోదరుడు రవిశంకర్ కూడా తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం గమనార్హం. ఇక సాయికుమార్ సినిమాలతో పాటు వ్యాపార, రాజకీయ రంగాల్లో కొనసాగుతున్నారు. సాయికుమార్ తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంటారు.
సాయికుమార్ ప్రముఖ నటుడు పి.జె.శర్మ కుమారుడు. సాయికుమార్ మద్రాసులో పుట్టి పెరిగాడు. తండ్రి కూడా డబ్బింగ్ కళాకారుడు కావడంతో సాయి కుమారుపై ఆయన ప్రభావం పడిందేమేనని అనిపిస్తుంది. బాల్యం నుంచే ఆ వృత్తిలో ప్రవేశించాడు. కథానాయకులు సుమన్, రాజశేఖర్ ల సినిమాలకు మొదట్లో డబ్బింగ్ చెప్పాడు. కంఠస్వరం, తెలుగు ఉచ్ఛారణ బాగుండటంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో నటుడిగా కూడా మంచి అవకాశాలు లభించాయి. సాయికుమార్ సినీ ప్రస్థానం డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రారంభమైంది. ఆయన డబ్బింగ్ చెప్పిన తొలిచిత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన సంసారం అనే సినిమా.
కొన్నాళ్ల తర్వాత బాలనటుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. బాలనటుడిగా సాయికుమార్ చేసిన తొలిసినిమా దేవుడు చేసిన పెళ్లి. అందులో ఆయన అంధుడిగా నటించాడు. తర్వాత దర్శకుడు మధుసూదన్రావు తెరకెక్కించిన జేబు దొంగ సినిమాలో నటించాడు. ముందుగా కన్నడ చిత్రాలలో కథానాయకుడిగా నటించిన తర్వాతే తెలుగు సినిమాలలో నటించాడు. 1979 లో వచ్చిన గోరింటాకు సినిమాలో మహానటి సావిత్రి గారి కొడుకు "రాముడు" పాత్ర పోషించారు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా అనే పాటలో సాయి కుమార్ ని చూడవచ్చు. 2006లో వచ్చిన సామాన్యుడు చిత్రంలో విలన్ పాత్ర పోషించిన సాయికుమార్కు ఉత్తమ నటనకు గాను నంది అవార్డు దక్కింది. అలాగే 2010లో వచ్చిన ప్రస్థానం సినిమాలో నెగటివ్ షేడ్ పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపారు. అలాగే పోలీస్ స్టోరీ సినిమాతో తానేంటే ప్రేక్షకుల ముందు నిరూపించుకున్నాడు. ఆ ఒక్క సినిమా ఆయనకు వరుసగా హీరో స్థాయి కథలను తెచ్చిపెట్టింది.