ఆ డాక్టర్ దంపతులకూ కరోనా పాజిటివ్..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడుతున్న వైద్యుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో పలువురు మరణించారు కూడా. ఇటలీలోఅయితే..చాలా మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో వైద్యలోకంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు వైద్యసేలు అందిస్తున్న క్రమంలో డాక్టర్లు, సిబ్బంది కూడా వైరస్ బారినపడుతున్నారు. ప్రతీరోజు ఏదో ఒకచోట నుంచి ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని పలువురు వైద్యులు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులు, సిబ్బందికి వైరస్ సోకింది. తాజాగా.. మధ్యప్రదేశ్లో కూడా డాక్టర్ దంపతులకు కొవిడ్-19 సోకింది. వారితోపాటు మరో మరో నలుగురు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని హోం క్వారంటైన్లో ఉంచి చికిత్స చేస్తున్నారు.
హోసంగాబాద్ లోని ఇటర్షి ప్రాంతంలో ఉంటున్న డాక్టర్కు ఆయన భార్యకు, మరో నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. వారందరిని హోం క్వారంటైన్ లో ఉంచారు. వెంటనే అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. డాక్టర్ దంపతులు ఎవరెవరిని కలిశారో తెలుసుకుంటున్నారు. వారందరి వివరాలు సేకరిస్తున్నారు. వారిని కూడా క్వారంటైన్ కు తరలిస్తామని హోసంగాబాద్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ జైశని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డాక్టర్ దంపతులు ఎవరెవరి కలిశారోనని చుట్టుపక్కల వాళ్లు బిక్కిబిక్కుమంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ముంబైలోని వోక్హార్ట్ ఆస్పత్రిలో ఏకంగా 26మంది నర్సులు, ముగ్గురు వైద్యలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అంతకుముందు కేరళలో కూడా ఓ నర్సుకు కరోనా వైరస్ సోకింది.