ఆ దేశాలకు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్..!
కరోనాతో అగ్రరాజ్యం అమెరికా చివురుటాకులా వణికిపోతున్నది. కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. కొత్త వీసా మంజూరు నిబంధనను ప్రకటించారు. ఈ నిబంధన ప్రకారం... COVID-19 మహమ్మారి సమయంలో తమ పౌరులను స్వదేశానికి రప్పించడంలో తాత్సారం చేసిన ఆయా దేశాల పౌరులకు వీసా నిరాకరణకు వీలు కల్పిస్తుంది. వీసా ఆంక్షల కోసం ట్రంప్ మెమోరాండం కూడా జారీ చేశారు.
ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న విదేశీ పౌరులను వెంటనే ఆయా దేశాలు తీసుకెళ్లాలని ట్రంప్ ఆదేశించారు. లేదంటే ఆయా దేశాలపై వీసా ఆంక్షలు విధిస్తామని అధ్యక్ష భవనం హెచ్చరించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు వైట్హౌస్ ఆదేశాలిచ్చింది.
తమ పౌరులు, జాతీయులను సొంత ప్రాంతాలకు తరలించడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్న లేదా తీసుకెళ్లటానికి నిరాకరిస్తున్న దేశాలు ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ల ఆరోగ్యానికి హాని తలపెడుతున్నాయని వైట్ హౌస్ భావిస్తోంది. అమెరికా చట్టాలను అతిక్రమించి ఇక్కడ ఉంటున్న విదేశీయులను కచ్చితంగా వారి దేశాలకు తీసుకెళ్లాల్సిందే అని ఆదేశాల్లో పేర్కొన్నారు.