బిగ్ బ్రేకింగ్: జమ్మూకశ్మీర్లో 17 కొత్త పాజిటివ్ కేసులు
జమ్మూకశ్మీర్లో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జమ్మూ డివిజన్ నుండి 5, కాశ్మీర్ నుండి 12 కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 224కు చేరుకుంది. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసులు 7,447కు పెరిగాయి. మరణించిన వారి సంఖ్య 239కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలావుండగా, లాక్డౌన్ పొడిగించాలని ఒడిశా, పంజాబ్ నిర్ణయం తీసుకున్నాయి. అలాగే. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా ఈనెల 30వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే..ఏప్రిల్ 14 తేదీ వరకు లాక్డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో ఆ తర్వాత లాక్డౌన్ను పొడిగిస్తారా..? లేదా..? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉదయం లేదా.. రాత్రి కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటివరకు దేశంలో మూడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో 1666 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈరోజు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాను 24గంటలూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామని, అందరం కలిసికట్టుగా కరోనాపై పోరాడుదామని ప్రధాని పిలుపునిచ్చారు. పలువురు ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ను పొడిగించడమే మేలని సూచించారు. నిజానికి.. ఇప్పటికే కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా.. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.