జంతువుల నుంచి కరోనా వ్యాప్తి చెందదు..
కరోనా..కరోనా..కరోనా.. ఇప్పుడీ పదం తెలియని వారుండరు. కంటికి కనిపించని శత్రువు ప్రపంచాన్ని కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కోవిడ్ -19 పేరు వింటేనే ప్రజలు హడలెత్తుతున్నారు. కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి మాత్రమే వ్యాప్తి చెందుతుందని వైద్యుల చెబుతున్నప్పటికీ అనేక భయాలు వెంటాడుతున్నాయి. గాలి నుంచి, జంతువుల నుంచి కూడా వైరస్ సోకుందని ప్రజల్లో అపోహలున్నాయి. అయితే వాటన్నింటినీ ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా పటాపంచలు చేస్తున్నారు.
జంతువుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. ప్రధానంగా మనుషుల నుంచి మనుషులకు మాత్రమే కరోనా వ్యాప్తి చెందుతుందని ప్రస్తుత పరిశోధనల్లో తేలిందని, అయితే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువని ఆయన వివరించారు.
అందువల్ల ఇళ్లలో పెంపుడు జంతువులు ఉన్నంత మాత్రాన వాటి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందన్న అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటున్న వారెవరూ భయపడాల్సిన పనిలేదని డాక్టర్ రణ్దీప్ గులేరియా స్ఫష్టం చేశారు.