కరోనా షాకింగ్: ఇంటి గడపదాటని ఆ ఇద్దరికీ పాజిటివ్.. ఇదెలా సాధ్యం..?
కరోనా వైరస్ షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇంట్లో నుంచి అడుగుబయటపెట్టకున్నా.. ఈ వైరస్ సోకుతోంది. లక్షణాలు కనిపించకున్నా.. పరీక్షల్లో పాజిటివ్ వస్తోంది.. దీంతో ప్రభుత్వాలు.. వైద్యులు, ప్రజలు షాక్ తింటున్నారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నారు. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో మహమ్మారి కలకలం రేపుతోంది. నగరంలోని గాంధీ నగర్కు చెందిన ఓ వ్యక్తి(48) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయన కాళ్లు, చేతులు పని చేయకపోవడంతో ఎటూ అడుగుతీసి అడుగు వేయలేడు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విదేశాలకు కానీ, ఇతర ప్రాంతాలకు కానీ వెళ్లి వచ్చిన నేపథ్యం లేదు. అయితే.. ఆ వ్యక్తి దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అతనికి వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా, పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
హైదరాబాద్లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.. టోలిచౌకికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక దగ్గు, జలుబు, జ్వరం బారిన పడింది. వెంటనే బాలికను చికిత్స కోసం తల్లిదండ్రులు బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ పిల్లల దవాఖానకు తీసుకెళ్లారు. అయితే.. వైద్యులకు అనుమానం వచ్చి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. నిజానికి ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం ఆమెకు కానీ, ఆమె తల్లి దండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకుగానీ లేదు. ఎలాంటి కాంటాక్ట్ హిస్టరీ లేకపోయినా బాలికకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో తల్లిదండ్రులతో పాటు వైద్య సిబ్బంది బెంబేలెత్తిపోయారు. ఇక కాంటాక్ట్ హిస్టరీ ట్రేస్ చేసేందుకు వెళ్లిన సర్వె లెన్స్ ఆఫీసర్లకు కూడా ఇది సోకిందో అంతుచిక్కడం లేదట. బాధితులకు వైరస్ ఎలా సోకిందో తెలియక వారి కుటుంబ సభ్యులతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. అసలు ఇది ఎలా సాధ్యమంటూ వైద్యవర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.