కొవిడ్ వారియర్స్కు సెల్యూట్.. అదిరిపోతున్న ఏపీ పోలీస్ పాట
కరోనా వైరస్ నివారణకు కీలకపాత్ర పోషిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారిశుద్ద్య కార్మికుల లాంటి కోవిడ్ వారియర్స్తో పాటు ఇంట్లోనే ఉంటూ కరోనా వ్యాప్తి కట్టడికి సహకరిస్తున్న పౌరులందరికి ఏపీ పోలీస్ సెల్యూట్ చేస్తున్నట్లు రూపొందించిన పాటను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఆవిష్కరించారు. ఛలే జా కరోనా పాటకు లిరిక్స్, మ్యూజిక్తో పాటు డైరెక్టర్గా స్పార్జన్ వ్యవహరించారు. పాటను ఆలపించిన సింగర్ శ్రీరామచంద్రను డీజీపీ అభినందించారు. ఈ పాటకు అన్నివర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. నిజానికి.. గతంలో ఏపీ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించడానికి డ్యాన్స్ చేస్తూ ఓ వీడియో కూడా రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే..ఏపీకి చెందిన మహిళా పోలీస్ అధికారి కూడా పాటపాడారు. తాజాగా.. డీజీపీ గౌతం సవాంగ్ కొత్త పాటను రూపొందించి విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు పోలీసులు కూడా చైతన్య గీతాలు ఆలపిస్తున్నారు.