బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో మరో 43 కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. దీంతొ తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 809కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసులు 605కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి చికిత్స పొంది 186 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ 19 వైరస్ బారిన పడి 18 మంది మృతి చెందారు. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 31 కొత్త కేసులు నమోదు కాగా, గద్వాల జోగులాంబ జిల్లాలో 7, సిరిసిల్లలో 2, రంగారెడ్డిలో 2, నల్లగొండ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్లు ప్రధానంగా హైదరాబాద్పై దృష్టి సారించారు. అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తూ కరోనా కట్టడికి కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 186 మంది కోలుకున్నారు. గత రెండు రోజులుగా మరణాలు సంభవించలేదు. ఇక మొదటి స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది.