కరోనా ఎఫెక్ట్: సంచలన నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా
కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలు పవిత్ర స్థలంగా భావించే మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుందన్న కారణంతోనే మూసివేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రంజాన్ మాసంలో ఉపవాసాల సందర్భంగా ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది ముస్లింలు మక్కాకు, హజ్ యాత్రకూ వస్తారు. ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. అయితే.. కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల కారణంగా మక్కాలో ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ వెల్లడించారు.
రంజాన్ సందర్భంగా ముస్లింలు ఉపవాసాలు ఉండటంతోపాటు తరావీ నమాజులు చేస్తుంటారు. తరావీ నమాజులతో పాటు రంజాన్ ఈద్ నమాజ్ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ షేఖ్ కోరారు. భారత్లోనూ రంజాన్ మాసం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు వక్ఫబోర్డులు కూడా చర్యలు తీసుకుంటున్నాయి.