కరోనా వైరస్ అందుకే వచ్చింది.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కామెంట్స్!
భారత్లో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన కామెంట్స్ చేశారు. మన సంస్కృతీ సంప్రదాయాలను పట్టించుకోకుండా.. పాశ్చాత్యపోకడలకు అలవాటుపడడం వల్లే కరోనా వంటి వైరస్లు వస్తున్నాయని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా నిరు పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రభావంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నిజానికి.. భారతదేశంలో కరోనా కన్నా ప్రమాదకరమైన వ్యాధులు గతంలోనే వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఆనాడు వచ్చిన ప్లేగు, డెంగీ వంటి వ్యాధులతో కూడా అనేకమంది మరణించారని, చివరకు మన ఆచార, సంప్రదాయాల ద్వారా ఆ వ్యాధులను అడ్డుకోగలిగామని ఆయన గుర్తు చేశారు. కానీ.. నేడు మన సంస్కృతీసంప్రదాయాలను గాలికివదిలివేస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మనం మన ఆచార సంప్రదాయాలను పాటించాలని, లేనిపక్షంలో మరిన్ని వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అన్నారు. కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ ఒక్కరు లాక్డౌన్ నిబంధనలను, సామాజికదూరం పాటించి, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.