ఏపీలో దారిమళ్లిన రేషన్ బియ్యం..?
ఏపీలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారిపడుతున్నాయి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. అయితే.. వారిపై లారీ డ్రైవర్ తిరగబడ్డాడు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారంటూ సంబంధిత తహసీల్దార్కు సమాచారం ఇచ్చినా పట్టించుకోనట్లు తెలుస్తోంది. అయితే.. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న అధికారులు ఆ లారీని అక్కడి నుంచి పంపించారు. అయితే.. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు రేషన్ బియ్యాన్ని పక్కదారిపట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లాక్డౌన్ కారణంగా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు విడతలుగా కార్డుదారులకు రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. అయితే.. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని పక్కదారిపట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా.. అనకాపల్లిలో సీపీఎం నాయకులు అడ్డుకున్నట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.