ఇకపై మొబైల్ ఫోన్కే కరోనా రిజల్ట్ .. ఏపీలో సరికొత్త విధానం
కరోనాపై ప్రజల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని పోగొట్టేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో ఇకపై మొబైల్ ఫోన్ కే కరోనా ఫలితం వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఎస్ఎంఎస్ ద్వారా కరోనా ఫలితాన్ని అధికారులు పంపుతారు.
సకాలంలో కోవిడ్ ఫలితాల సమాచారం అనుమానితులు, బాధితులకు అందేలా జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
అందుకు తగ్గట్టు ఫలితాలు వెళ్లేలా జిల్లా అధికారులు ‘అనంత’లో ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ధైర్యాన్ని నింపడ మేగాక.. నెగిటివ్ వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్షలు చేసుకున్న వారికి సంక్షిప్త సమాచారం వెళ్తోంది. కొవిడ్ అని నిర్ధారణ అయిన వెంటనే బాధితుల సెల్ నంబర్కు కలెక్టర్ పేరు మీద మెసేజ్ వెళ్తుంది.
కోవిడ్ పాజిటివ్ అయితే.. ‘ప్రియమైన వ్యక్తి పేరు, క్షమించండి. మీ ఐడీ కింద కోవిడ్ 19 పరీక్ష మీకు పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం మీకు మెరుగైన వైద్య సేవలందింస్తుంది. మీరు కోవిడ్తో పోరాడి ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అవుతారని’ సందేశం వస్తుంది. నెగిటివ్ అయితే..‘ డియర్.. (పూర్తి పేరు) నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఐడీ నంబర్ 2461 కోవిడ్ –19 పరీక్ష నెగిటివ్ వచ్చిందని’ సందేశం వస్తుంది.