మే నెలలోనే పదో తరగతి పరీక్షలు.. క్లారిటీ ఇచ్చిన కేసీఆర్
తెలంగాణలో మధ్యలోనే ఆగిపోయిన పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి విద్యార్థులకు భరోసా ఇచ్చారు. పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో పిల్ వేస్తామని, హై కోర్టు అనుమతి తీసుకుని మే నెలలోనే పరీక్షలు నిర్వహిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యార్థులను ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక వచ్చే విద్యాసంవత్సరంపై దేశంలోని పరిస్థితులను బట్టి నిర్ణయం తీసు కుంటామని ఆయన తెలిపారు.
అలాగే.. రేపటి నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటనతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి.. దేశంలో లాక్డౌన్ ప్రారంభానికి ముందే తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే.. రెండు రోజుల్లో కరోనా వైరస్ తీవ్రత పెరగడంతో పరీక్షల నిర్వహణను వాయిదా వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థలకు పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.