షాకింగ్ న్యూస్: 2020-21లో వృద్ధిరేటు సున్నా శాతమేనట..!
కరోనా దెబ్బకు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. భారత దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో దేశీయ వృద్ది రేటు గణనీయంగా పతనం కానుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్సీస్ శుక్రవారం ప్రకటించింది. నెగెటివ్ నుంచి భారత్ రేటింగ్ అవుట్లుక్ను సున్నాకు తగ్గించేయడం గమనార్హం. కొవిడ్-19 కల్లోలం, లాక్ డౌన్ కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎటువంటి వృద్ధిని కనబరచదని వెల్లడించింది. అయితే 2022లో ఇది 6.6 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఆర్థిక లోటు జీడీపీ లో 5.5 శాతానికి పెరుగుతుందని మూడీస్ విశ్లేషకులు శుక్రవారం తెలిపారు.
బడ్జెట్ అంచనా ప్రకారం 3.5 శాతం మాత్రమే. గత నెల చివరిలో, మూడీస్ తన క్యాలెండర్ సంవత్సరం 2020 జీడీపీ వృద్ధి అంచనాను 0.2 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిందని పేర్కొంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడి, మందగించిన ఉద్యోగ కల్పన, బ్యాంకింగేతర రంగాల్లో నెలకొన్న మూల ధన సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందని అభిప్రాయపడింది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.