ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 600 కరోనా కేసులు
తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రతీ రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ రోజు ఏకంగా కొత్తగా 600 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో చెన్నై నగరంలోనే 399 కేసులు నమోదు అయ్యాయని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ వెల్లడించారు. దీంతో మొత్తంగా రాష్ట్రంలో 5409 కరోనా కేసులు నమోదవగా, 37 మంది మరణించారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం 3825 కేసులు యాక్టివ్గా ఉన్నాయని, మరో 1547 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. అయితే.. తమిళనాడులో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నా.. మరణాల శాతం మాత్రం చాలా తక్కువగా ఉందని అధికారవర్గాలు అంటున్నాయి. త్వరలోనే కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరనమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే.. రోజూ వందల సంఖ్యలో నమోదు అవుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.