20 లక్షల కోట్లు : 40రోజుల్లో భారత్ శక్తేమిటో ప్రపంచానికి తెలిసింది..
కరోనా వైరస్ కట్టడికి భారత్ తీసుకుంటున్న చర్యలతో ఈ 40 రోజుల్లో భారత్ శక్తేమిటో ప్రపంచానికి తెలిసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను బుధవారం సాయంత్రం 4గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు. వివిధ మంత్రిత్వశాఖలతో చర్చించాక ప్యాకేజీకి రూపకల్పనచేసినట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ భారత్ స్వావలంబన సాధించేందుకు ఉపయోగపడుతుందని, అందుకే దీనిని *ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్* అని పిలుస్తున్నామని ఆమె పేర్కొన్నారు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత గరీభ్ కల్యాణ్ యోజన కింద ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, అన్నివర్గాల ప్రజలను ఆదుకున్నామని అన్నారు.
రెండో ప్యాకేజీ స్వదేశీ బ్రాండ్లను తయారు చేయడానికి, అంతర్జాతీయ గుర్తింపు సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఎంతోదోహదపడుతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ, ప్రజలు, డిమాండ్ ఐదు అంశాల ఆధారంగా నిర్భర్ భారత్ మిషన్ చేపట్టామని తెలిపారు.