అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్ల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అమెరికన్ అధికారులు దర్యాప్తును చేపట్టారు. మినియాపొలిస్ నగరంలో మే 25న పోలీస్ కస్టడీలో ఫ్లాయిడ్ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిరసనకారులు వెనక్కితగ్గకుంటే శాంతిభద్రతలు కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపింది.
అయితే.. దీనిపై ట్రంప్ వెనక్కి తగ్గడం గమనార్హం. కాగా, జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంపై ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు.