ఈ నెల 14వరకు కోర్టుల మూసివేత
కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ హైకోర్టు పరిధిలోని సబార్డినేట్ కోర్టులు, ట్రైబ్యునళ్లు, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథార్టీ, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీల మూసివేత ఉత్తర్వులను జూన్ 14వరకు పొడిగించారు. ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర సివిల్, క్రిమినల్ కేసులతోపాటు తుది దశలో ఉన్న కేసులను వీడియో కాన్ఫెరెన్సు ద్వారా మాత్రమే విచారించాలని, సిబ్బందిని వంతుల వారీగా హాజరయ్యేలా ఆదేశించాలని న్యాయాధికారులకు సూచించారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల ప్రధాన కోర్టుల్లో ఆన్లైన్ ఫైలింగ్తోపాటు, ఆఫ్లైన్(భౌతిక)ఫైలింగ్ను అనుమతించాలని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైకోర్టు రోజువారీ విధులను ఈనెల 28 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు మరో ప్రకటనలో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా కాకుండా ప్రత్యక్షంగా విచారణ జరగాలని ఇరుపక్షాల న్యాయవాదులు కోరిన పక్షంలో రెండు రోజుల ముందే రిజిస్ట్రార్(జ్యుడీషియల్)కు నోటీసు ఇవ్వాలని సూచించారు. ప్రత్యేక అభ్యర్థనల మేరకు చేపట్టే కేసులను సికింద్రాబాద్లోని జ్యుడీషియల్ అకాడమీలో విచారణ చేస్తామని ఆ ఉత్తర్వులలో తెలిపారు.