తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా... పెరుగుతోన్న కేసులు... తగ్గుతోన్న రికవరీ..!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. ప్రతి రోజు హెల్త్ బులిటెన్ వస్తోందంటే చాలు అందరూ హడలిపోతోన్న పరిస్థితి. ఇక ఏపీలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి ఆలయంలోనే ఏకంగా 80 కేసులు నమోదు కావడంతో అందరూ షాక్ అయ్యారు. రోజుకు సగటున ఏపీలో వెయ్యి కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే నాలుగు నెలల నుంచి వచ్చిన కేసులు 20 వేలు దాటాయి. అయితే ఇప్పుడు రోజుకు వెయ్యి కేసులు రావడంతో ఈ సంఖ్య వచ్చే నెల రోజుల్లోనే ఏకంగా 50 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఏకంగా 12మంది మృతి చెందడం కలకలం రేపింది.
ఇక తెలంగాణలో కరోనా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. రోజుకు అక్కడ 1500కు పైగానే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ సంఖ్య 2 వేలకు చేరువలో ఉంది. ఇప్పటికే అక్కడ కేసులు 30 వేలు దాటాయి. పరీక్షలు పెంచితే అక్కడ కేసులు మరిన్ని నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 324మంది కరోనాతో చనిపోయారు. జీహెచ్ఎంసీలోనే కేసుల తీవ్రత అధికంగా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా చూస్తే కేసుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు రికవరీ రేటు తీవ్రంగా పడిపోతుండడం ఆందోళనగా ఉంది.