నేడే టీకా..అతి పెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం !!
ఎట్టకేలకు సామాన్యులకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ నేటి నుండి అందుబాటు లోకి రానుంది. ఏ దేశం చేపట్టని విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ భారత్లో ప్రారంభం కాబోతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు ఉదయం 10.30 గంటలకు దేశ వ్యాప్తంగా వాక్సిన్ ప్రక్రియను ప్రదాన మంత్రి నరేంద్ర మోడి అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటిదశగా మొత్తం 3,006 కేంద్రాలలో దేశ వ్యాప్తంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పరిస్థితులను బట్టి తరువాత టీకాలు వేసే కేంద్రాల సంఖ్య 5 వేలకు పైగానే పెంచనున్నట్టు తెలిపింది.
దేశంలో మొత్తం 12 నగరాలకు ఇప్పటికే చేరుకున్న కరోనా వాక్సిన్ తరలించారు. “టీకా” తీసుకున్న వారి ఖచ్చితమైన సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకుగాను “కోవిన్” అనే కొత్త యాప్ ను రూపొందించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వాక్సిన్ సరఫరాకు సంబంధించి 24 గంటలు సమాచారం అందించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం 1075 నెంబరు తో “హాట్ లైన్” ఏర్పాటు చేసింది. మొత్తానికి భారత్, ఏదేశం కూడా చేపట్టని విధంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టి ప్రపంచం లోనే ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.