తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆమె.. తాను ప్రచారానికి వెళుతుంటే ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై జగన్ పెదవి విప్పక పోవడంతో పాటు ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆమె చెప్పారు.అందుకే తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా సంచలన ఫలితం నమోదు కాబోతుందని ఆమె జోస్యం చెప్పారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అన్ని రకాలుగా నాశనం అయిందని పనబాక లక్ష్మి ఆరోపించారు.