దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్ ను ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ లు విధించాయి. ఈ క్రమంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధిస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. మే 9 వ తేది నుండి 23వ తేది వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నిత్యావసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రజా రవాణా, కాసినోలు, హోటళ్లు, పబ్బులు పూర్తిగా మూసివేస్తున్నట్లు సావంత్ తెలిపారు. కరోనా కట్టడి చేసేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా వార్డు స్థాయి కమిటీలను బలోపేతం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.