కరోనా వైరస్ రెండో దశలో ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకూ ప్రతీ ఒక్కరిని ఈ మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈసారి వైరస్ ప్రభావం క్రీడారంగం పై గట్టిగానే ఉంది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు కరోనా సోకి ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. కొందరు వైరస్ నుంచి కోలుకున్నారు. మరి కొందరు ఈ కరోనా మహమ్మారికి బలైయ్యారు.
అయితే తాజాగా భారత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మాజీ క్రీడాకారుడు, ‘అర్జున అవార్డు’ గ్రహీత వేణుగోపాల్ చంద్రశేఖర్ (64) కరోనాతో కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా క్రీడాలోకం మూగబోయింది. మూడుసార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన చంద్రశేఖర్ 1982 కామన్వెల్త్ క్రీడల్లో సెమీఫైనల్ చేరారు. క్రీడాకారుడిగా కెరీర్ ముగిశాక ఆయన కోచ్గా మారారు. ప్రస్తుత యువ ఆటగాడు సత్యన్, జాతీయ మాజీ చాంపియన్ ఎస్.రామన్ ఆయన శిష్యులే.