దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఎంతసేపూ పెరగడమే కానీ తగ్గిన సందర్భాలు కనిపించట్లేదు. సగటు జీవి జీతమంతా పెట్రోలు, డీజిల్కే అయిపోతోంది. చమురు కంపెనీలు ఇష్టా రాజ్యంగా ధరలు వడ్డించేస్తున్నాయి. అసలే కరోనా వల్ల నానా తిప్పలు పడుతున్న దేశ ప్రజలను చమురు కంపెనీలు మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. కరోనా నుండి సామాన్యుడు కోలుకోవట్లేదు. పెరుగుతున్న ధరలతో బతుకు భారంగా మారగా, భవిష్యత్తూ అంధకారంలోకి మారనుంది. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ కూడా అమల్లో ఉంది. అయినా.. దేశంలో పెట్రోల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ఎన్నికల తర్వాత రోజువారీగా ప్రజల నెత్తిన భారాన్ని మోపుతున్నాయి. మే 4 తేదీ నుంచి పెట్రో ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దీని ఫలితంగా దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. బోఫాల్లో లీటరు పెట్రోల్ రూ.100.08 ఉండగా ఇండోర్లో రూ.100.16 చేరింది. ఇక రాజస్తాన్లోని. శ్రీగంగానగర్లో దేశంలోనే ఎక్కడా లేనంత అధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.102.96కు చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.95.89గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.95.67, డీజిల్ ధర రూ.90.06గా ఉంది.