కరోనా కష్టాల మధ్య రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లోకి తొలి విడత పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. కొవిడ్ కష్టకాలంలో ఆర్థిక వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటీకి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వైఎస్ ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేసినట్లు సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఆయన నిధులు విడుదల చేశారు.
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే రైతు భరోసా కార్యక్రమం చేపట్టామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ.. 52.38లక్షల మంది రైతులకు రూ. 3,928కోట్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ. 89వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా పంపామని, అందులో రైతు భరోసా కింద రూ. 17వేల 29 కోట్ల నిధులు విడుదల చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 1,038 కోట్లు ఇచ్చామన్నారు. రైతుభరోసా- పీఎం కీసాన్ పథకంలో భాగంగా మూడో ఏడాదికి తొలి విడత సాయంమందిస్తున్నట్లు చెప్పారు.