దేశ పశ్చిమ తీర రాష్ట్రాలను ‘తౌక్టే’ తుపాను గజగజ వణికిస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన ఈ తుపాను ఇప్పుడు మరింత బలపడి ‘పెను తుపాను’గా మారినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ఉద్ధృతి దృష్ట్యా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. దీంతో ముంబయి పశ్చిమ శివారుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముంబయి ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలను నిలిపివేశారు. తౌటే తుఫాను ప్రభావంతో ముంబై విమానాశ్రయం..సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు విమానయాన శాఖ ప్రకటించింది. ఈ తుఫాను ఉత్తర, వాయవ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకి, మంగళవారం తెల్లవారుజామున పోరుబందర్- మహువా (భావ్నగర్ జిల్లా) ల మధ్య తీరాన్ని దాటనుందని వెల్లడించింది.