కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను త్వరగా పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి సర్వర్ల సమస్య ఒక అడ్డంకిగా మారింది. తాజాగా జీహెచ్ఎంసీ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో సర్వర్ సమస్య తలనొప్పిగా మారింది. రెండు రోజులుగా సర్వర్ల సమస్య కారణంగా స్లాట్ బుకింగ్ అవ్వడం లేదు.
అంతే కాకుండా కొన్ని సెంటర్లలో మూడు రోజుల క్రితం బుకింగ్ చేసుకున్న వారికి కూడా వ్యాక్సిన్ అందని పరిస్థితి ఏర్పడింది.
ఈ రోజు స్లాట్ బుకింగ్ సమస్యతో సీతాఫల్ మండి వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద గందరగోళం నెలకొంది. ఉదయం నుంచి కిలోమీటర్ల మేర ప్రజలు లైన్ లో నిలుచున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తానికి ఒకే చోట వ్యాక్సిన్ పెట్టడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.