సీమలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ విప్పినట్టు కనిపిస్తోంది. పాత కక్షల కారణంగా మళ్లీ ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు మర్చిపోకముందే అనంతపురంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు నారాయణప్ప, రాజగోపాల్ ను భూతగాదాల కారణంగా ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. అయితే హత్య చేసింది అదే గ్రామానికి చెందిన నగేష్, దేవరాజ్ అని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు .
అంతే కాకుండా హంతకులను అరెస్ట్ చేసే వరకూ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించమంటూ ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు నచ్చజెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతే కాకుండా నగేష్, దేవరాజ్ కు చెందిన భూమిలోని పంటను మృతుల కుటుంబీకులు నాశనం చేశారు. పైప్ లైన్ లను కట్ చేశారు. వారి ఇళ్లపై దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో అనంతలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .