జూన్ 1 నుండి రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరవాలని సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేసీఆర్ నిర్ణయాన్ని ఉపాద్యాయ సంఘాలు వ్యతిరేఖిస్తున్నాయి. స్కూళ్ళు తెరవడానికి పూర్తి సన్నద్ధత కాకముందే సీఎం నిర్ణయం తీసుకోవడం విచారకరమని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని ఉపాధ్యాయుల సంఘం యూటీఎఫ్ ఆరోపిస్తోంది. జూలై 1 లోగా అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో పారిశుధ్య సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని డిమాండ్ చేస్తోంది.
విద్యా వాలంటీర్లను తక్షణం రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం భోజనం బియ్యం స్టాక్ ను కూడా వెంటనే వెనక్కి పంపి కొత్త స్టాక్ తెప్పించాలని అన్నారు. ఉపాధ్యాయ బదిలీల పై సీఎం అసెంబ్లీ లో హామీ ఇచ్చినా ఇంతవరకు ప్రక్రియ సాగలేదన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన జరిగాకే స్కూళ్ళు తెరవాలని అన్నారు. ప్రత్యక్ష బోధన తోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని చెప్పారు. పరీక్షలు లేకుండా పాస్ అవుతుండటం తో విద్యాప్రమాణాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. కరోనా జాగ్రత్తల పై తల్లిదండ్రులకు అనుమానాలు తీరేలా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.