వేడెక్కిన పంజాబ్ రాజకీయం?
నవజ్యోత్సింగ్ సిద్ధూను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత రాజకీయాలు చల్లబడతాయనుకుంటే మరింత వేడెక్కాయి. బుధవారం స్వర్ణదేవాలయం సందర్శనకు భారీగా నేతలు తరలిరావాలంటూ సిద్ధూ ఇచ్చిన పిలుపునకు 60 మంది ఎమ్మెల్యేలు రావడంతో ఒక్కసారిగా పంజాబ్ రాజకీయం వేడెక్కింది. అమృత్సర్లో పెద్దసంఖ్యలో సిద్ధూ కటౌట్లు వెలిశాయి. అలాగే స్వర్ణదేవాలయం వద్ద కార్యకర్తలు, నేతలతో కార్యక్రమం బలప్రదర్శనను తలపించింది. సిద్ధూ పీసీసీ అధ్యక్షుడైన తర్వాత ముఖ్యమంత్రి అమరిందర్ను సిద్ధూకానీ, సిద్ధూను అమరిందర్కానీ ఇంతవరకు కలవలేదు. తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబితేనే కలుస్తానని కెప్టెన్ అమరిందర్ స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్లాల్ జుల్పూర్ మాట్లాడుతూ పంజాబ్ మొత్తం సిద్ధూను కోరుకుంటోందని, ఆయన నియామకంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 77గా ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన సిద్ధూ ముఖ్యమంత్రి అమరిందర్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని మదన్లాల్ అన్నారు.