ప్రధానమంత్రిని కలిసిన చినజీయరుస్వామి
శంషాబాద్ ముచ్చింతల్లోని చినజీయరుస్వామి ఆశ్రమంలో రామానుజాచార్యులవారి 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్నిఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. పంచలోహాలతో తయారవుతోన్న ఈ విగ్రహావిష్కరణ ప్రాజెక్టు 200 ఎకరాల్లో వెయ్యికోట్లరూపాయలతో రూపుదిద్దుకుంటోంది. ఫిబ్రవరి రెండోతేదీ నుంచి 14వ తేదీ వరకు 35 హోమగుండాలతో ప్రత్యేక యాగాలను, ఇతర కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. దీనికి ఆహ్వానించేందుకు చినజీయరుస్వామి, మైహోం జూపల్లి రామేశ్వరరావు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. కచ్చితంగా వస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచశాంతి కోసం చినజీయరుస్వామి చేస్తున్న కార్యక్రమాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఈ ఉత్సవానికి ఆహ్వానించేందుకు చినజీయరుస్వామి ఐదు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్కొవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్షా, కిషన్రెడ్డి, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్భగవత్ తదితరులను ఆయన ఆహ్వానించారు.