జీఎంఆర్కు రూ.5లక్షల జరిమానా?
శంషాబాద్ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్ గ్రూప్కి జరిమానా పడింది. ప్రయాణికులకు అందించే సేవల్లో లోపాల కారణంగా ఈ జరిమానాను తెలంగాణ కన్సుమర్ డిస్ప్యూట్ రిడ్రెస్సల్ కమిషన్ విధించింది. సుబ్రతో బెనర్జీ అనే వ్యక్తి 2014 సెప్టెంబరు 10న బెంగళూరు వెళ్లేందుకు జీఎంఆర్ ఎయిర్పోర్టుకి వచ్చారు. విమానం ఎక్కేందుకు ఎస్కలేటర్పై వెళ్తుండగా ఒక్కసారిగా జర్క్ ఇచ్చి ఆగిపోవడంతో సుబ్రతో బెనర్జీ కింద పడ్డారు. ఎస్కలేటర్పై ఉన్న ఇతర వ్యక్తులు కూడా కిందపడ్డ ఆయనపై పడిపోయారు. గాయపడ్డ బెనర్జీ 75 రోజుల పాటు ఆఫీసుకు వెళ్లలేకపోయారు. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఎస్కలేటర్పైకి ఒకేసారి ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ లోడ్ అయ్యిందని, దీంతో ఎస్కలేటర్ నెమ్మదిగా ముందుకు వెళ్లి ఆగిందని, ఎస్కలేటర్ ఎప్పుడు ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి రాదని జీఎంఆర్ యాజమాన్యం తెలిపింది. సుబ్రతో బెనర్జీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామని, గుడ్విల్గా రూ. 1.51 లక్షలు చెల్లించామని వివరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కమిషన్ ఎయిర్పోర్టు అథారిటీదే తప్పుగా తేల్చి బాధితుడికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.