ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 14 గురువారం నుంచే సినిమా హాళ్లను వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడుపుకునేందుకు జగన్ సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా హాళ్లు రన్ అవుతున్నాయి. అయితే కరోనా ఉద్ధృతి తగ్గడంతో.. సినిమా హాళ్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసినా కూడా కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి థియేటర్ వద్ద మాస్క్, శానిటేషన్ తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా నిబంధనలు పాటిస్తూ వంద శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లను నడపాలని సూచించింది.