కరోనా: జూనియర్ కొవాగ్జిన్ ఎప్పుడు?
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి ప్రమాద ఘంటికలు మోగించే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో రోజుకు సగటున 22వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికిపైగా కేసులు వస్తున్నాయి. ఇప్పటికే భారత్లో కరోనావల్ల మరణించినవారి సంఖ్య నాలుగున్నర లక్షల వరకు ఉంది. రాబోయేది శీతాకాలం కాబట్టి ఇంకా జగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మనదేశంలో చిన్నారులకు టీకా ఇవ్వడానికి అనుమతులివ్వాలని కొవాగ్జిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ కేంద్రాన్ని కోరింది. దీనికి సంబంధించిన అన్ని పరిశోధన పత్రాలను పరిశీలిస్తున్నామని, టీకా తయారీపై ఒక అవగాహనకు రాగానే అనుమతులు మంజూరు చేస్తామని కొవిడ్ టాస్క్ఫోర్స్ అధిపతి వీకేపాల్ ప్రకటించారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలకు ఈ టీకాను అందించాలని కంపెనీ భావిస్తోంది. మరోవైపు దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు వేయించుకున్నవారికి బూస్టర్డోస్గా కార్బొవాక్స్ టీకాకు అనుమతివ్వాలంటూ హైదరాబాద్కు చెందిన కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది.