తెరవెనక మంత్రాంగానికి సిద్ధం..!!
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కీలక ప్రచారపర్వం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. 30వ తేదీన పోలింగ్ జరనుంది. రెండోతేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున గెల్లు శ్రీనివాస్యాదవ్, భారతీయ జనతాపార్టీ తరఫున ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ తరఫున బల్మూరి వెంకట్ ప్రధానంగా పోటీపడుతున్నారు. ప్రచార పర్వం ముగియనుండటంతో ఈరోజు సాయంత్రం నుంచి మద్యం సీసాల పంపిణీతోపాటు ఓటుకు నోటు నగదు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మద్యం సీసాలతోపాటు మాంసాన్ని కూడా పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా 72 గంటల ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. దీంతో తెరవెనక మంత్రాంగం కోసం ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తయితే, ఇకనుంచి తెరవెనక ప్రలోభాలకు గురిచేసి ఓటర్లను ఆకట్టుకోవడం మరో ఎత్తుగా మారింది. ఇందులో విజయవంతమైనవారు ఎన్నికలో గెలుస్తారనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.