స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో టీఆర్ఎస్లో సందడి నెలకొంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన తెరా చిన్నప్పరెడ్డి ఉన్నారు. చిన్నప్పరెడ్డి పదవీ కాలం జనవరి మొదటి వారంలో ముగియనున్నది. ఆ ఖాళీ భర్తీ కోసం నవంబర్ 16న కేంద్రం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ ఎమ్మెల్సీ పరిధిలో 1246 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 80 శాతం వరకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారున్నారు. లోకల్ బాడీ కోటాలో నల్లగొండ సీటును కారు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తేరాను ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉన్నందున.. ఇప్పుడు కూసుకుంట్లకు ప్లాన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.