తెరుచుకోనున్న వరాహస్వామి ఆలయం తలపులు
తిరుమల కొండ పై తొలి దర్శనం, తొలి నైవేద్యం అక్కడకొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇవ్వరు. ఆయన కంటే ముందుగా కోనేరు పక్కన ఉన్న వరాహ స్వామికి నివేదిన చేస్తారు. ఇది తరతరాలుగా సాగుతున్న వైష్ణవ సంప్రదాయం. ఇందుకు సంబంధించి పెద్ద చరిత్రే ఉంది. అదికాసేపు పక్కన పెడదాం.
డిసెంబర్ 2020 నుంచి వరాహ స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడం లేదు. వారాహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. దీంతో నాటి నుంచి దేవాలయాన్ని మూసివేశారు. ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేశారు. అత్తి చెక్కతో నమూనా విగ్రహాలను తయారు చేసి అక్కడ తాత్కాలికంగా ప్రతిష్టించారు . స్వామివారి కళలను అత్తి విగ్రహాలలో నిక్షిప్తం చేశారు, స్వామివారికి జరప వలసి ఆగమోక్త కార్యక్రమాలన్నీ కూడా ఈ అత్తి విగ్రహాలకే నిర్వహిస్తున్నారు. దీంతో పూజార్లకు తప్ప మరెవరికీ వరాహ స్వామి దర్శనం 2020 డిసెంబర్ నుంచి లభించ లేదు.
కాగా ఈ నెల 24వ తేదీ నుంచి వరాహ స్వామి ఆలయంలో అష్టబంధన, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని టిటిడి సిద్ధాంతులు ముహూర్తం నిర్ణయించారు. దీనికి టిటిడి పాలక మండలి, ఆగమ సలహా మండలి అమోదం తెలిపాయి. నవంబర్ 24వ తేదీ సాయంత్రం ఆగమ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 25, 26,27 తేదీలలో యాగశాలలో ఆగమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 27 వ తేదీ వరాహ స్వామి వారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. 28 వ తేదీ యాగశాలలో శయనాధి వాసం జరిగుతుంది. అదే విధంగా 29 తేది యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అదే వరాహస్వామి తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.