అమర్నాథ్ యాత్ర.. శివుని భక్తులు ఎంతో పవిత్రంగా భావించే యాత్ర ఇది. ప్రకృతి అందాల మధ్య సాగే ఆధ్యాత్మిక సాహస యాత్ర ఇది. ప్రకృతి సహజంగా ఏర్పడే మంచు లింగాన్ని సందర్శించుకుని భక్తులు అలౌకిక ఆనందం పొందుతారు. అయితే.. కరోనా కారణంగా రెండేళ్లు నిలిచిపోయిన అమర్నాథ్ యాత్రకు ఈ ఏడాది భక్తుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు 20వేల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. ఈ వివరాలను జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్ సీఈవో బలదేవ్ ప్రకాశ్ వెల్లడించారు. ఏప్రిల్ 11న ప్రారంభమైన ప్రక్రియకు రెండు వారాల్లోనే భారీ సంఖ్యలో భక్తులు నమోదు చేసుకున్నారు. ఈ ఆదరణ వారికి యాత్ర పట్ల ప్రజల ఆసక్తిని తెలియజేస్తుందని బలదేవ్ అంటున్నారు. విజృంభించిన కరోనా కారణంతో గత రెండు సంవత్సరాలగా అమర్నాథ్ యాత్రని నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో అమర నాథుడుని దర్శించుకోడానికి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జూన్ 30 నుంచి ఆగస్ట్ 11 వరకు అమర్నాథ్ యాత్ర ఉంటుంది.