రేపు అమరావతిలో కీలక కార్యక్రమం జరగనుంది. అమరావతిలోని వెంకటపాలెంలో నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి హాజరు అవుతారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ వివరాలు తెలిపారు. రేపు ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు మిథున లగ్నంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అందుకే అందరికీ ఏర్పాట్ల చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వివరించారు. ఇప్పటికే టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి ఇతర అధికారులు ఇక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. టీటీడీ తరపున ఇతర రాష్ట్రాల్లో నిర్మించిన ఆలయాల కంటే అమరావతిలోని ఆలయం చాలా పెద్దది కావడం విశేషం.
అమరావతిలో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ 25 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ పచ్చదనం పెంచడంతో పాటు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెబుతున్నారు.