తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్రావు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఛార్జిషీటు విడుదల చేసిన తర్వాత హైదరాబాద్ చుట్టూ మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మాణంలో ఉన్నాయని హరీష్రావు ప్రకటించారని.. ఆ నిర్మాణం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి కొత్తపేటకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినట్లు మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తపేట సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పునాదిరాయి వేసిన ప్రాంతానికి మహేశ్వర్ రెడ్డి పర్యటించారు.
శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మహేశ్వర్ రెడ్డి మొక్కలు నాటారు. ఫ్రూట్ మార్కెంట్ను పూర్తిగా తొలగించారే కాని ఇంతవరకు ఆస్పత్రి నిర్మాణం ప్రారంభంకాలేదని.. శంకుస్థాపన చేసిన 9నెలలు అవుతున్నా పునాదులు కూడా తీయలేదని...కానీ మంత్రి హరీష్రావు మాత్రం నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అందుకే హరీష్ ఫేక్ ఫెయిల్యూర్ మంత్రిగా చెబుతున్నామని.. ఆసుపత్రి నిర్మాణానికి తట్టెడు మట్టి తీయలేదని...పన్నెండు వందల కోట్లతో సెక్రటేరియట్ కట్టుకున్నారని మహేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు.