హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి. 400 మందికి పైగా కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రధాన విగ్రహంతో పాటు అక్కడ నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెయిన్, సాండ్ స్టోన్ వర్క్స్, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, తదితర పనులను మంత్రి పరిశీలించారు.
125 అడుగుల ఎత్తుతో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా తెలంగాణకే మణిహారంగా నిలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విగ్రహం నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారని... ఏప్రిల్ 10 కల్లా పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో సిబ్బంది పనిచేస్తున్నాని మంత్రి చెప్పారు.