చంద్రబాబు సతీమణి భువనేశ్వరి `నిజం గెలవాలి` పేరుతో యాత్ర చేయబోతున్నట్లు టీడీపీ వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే చంద్రబాబు కుమారుడు లోకేశ్ యువగళం యాత్ర ఆపేసి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారనే ప్రకటనలు చేశారు. అయితే నిజం గెలిచినందుకే చంద్రబాబు జైలుకు వెళ్లారని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నిజాలను పాతాళంలోకి తొక్కేశారంటున్న మంత్రి అంబటి రాంబాబు.. ఇప్పుడు నిజం గెలుస్తున్నందునే చంద్రబాబు జైల్లో ఉన్నారని అన్నారు.
అసలు నిజం గెలవాలని కోరుకునేవారు 17A పట్టుకునే ఎందుకు తిరుగుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిజాన్ని ఓడించాలనే టీడీపీ ప్రయత్నం ఓడిపోతూనే ఉందని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఏనాటికైనా నిజం గెలవాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటుందన్న మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటికీ.. అంటే, దాదాపు 40 ఏళ్లుగా జరుగుతున్న నిజం అందరూ తెలుసుకోవాలన్నారు.